కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా సోమవారం హైదరాబాద్కు రానున్నారు. నిరుద్యోగ సమస్యపై పోరాటంలో భాగంగా టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలో సరూర్ నగర్లో నిర్వహించనున్న ‘యువ సంఘర్షణ’ పేరుతో భారీ ర్యాలీ మరియు బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు రాష్ట్ర నేతలు హాజరవనున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ సభలో ప్రియాంకా గాంధీ ‘యూత్ డిక్లరేషన్’ను ప్రకటించనున్నారు. దీనిద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఎలా కల్పిస్తుందనే దానిపై ప్రియాంక గాంధీ వివరించనున్నారు. అలాగే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో విద్యార్ధులు, నిరుద్యోగులు కోసం చేసిన కృషి, ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రియాంక గుర్తుచేయనున్నారు. ఇంకా తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు గుర్తింపు కార్డులు, నెలకు రూ.25 వేలు పింఛన్, ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత వంటి హామీలు ప్రకటించనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో నేటి సభలో ఆమె ప్రకటించే యూత్ డిక్లరేషనే ప్రధాన ఆకర్షణ కానుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో వరంగల్లో రాహుల్ గాంధీ ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్’ను రైతుల్లోకి ఎలా తీసుకెళ్లారో.. అలాగే ఈ ‘యూత్ డిక్లరేషన్’ను యువత వద్దకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ సభద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్దులు, యువతకు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందనే సంకేతాన్ని ఇవ్వనున్నారు. కాగా తెలంగాణలో తొలిసారి ప్రియాంక గాంధీ పాల్గొంటున్న బహిరంగ సభ కావడంతో టీ-కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో పాటు వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగులను పెద్ద ఎత్తున సరూర్ నగర్ తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఇక వివిధ జిల్లాల నుంచి యువతను సభా స్థలికి తరలించే బాధ్యతలను ఆయా జిల్లాల నేతలకు అప్పగించారు.
రంగారెడ్డి జిల్లా నుంచి 20వేల మందిని, మేడ్చల్ జిల్లా నుంచి 10వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సమావేశం జరుగునున్న సరూర్ నగర్ స్టేడియం పరిసరాలతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎల్బీనగర్ వరకు దారి పొడవున కటౌట్లు, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న మేరకు.. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రియాంక గాంధీ ఎల్బీనగర్ కూడలిలో ఉన్న తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన శ్రీకాంతా చారి విగ్రహం నుంచి సరూర్నగర్ స్టేడియం వరకు పాదయాత్ర చేయాల్సి ఉంది. అలాగే గాంధీ భవన్ నుంచి పాదయాత్ర నిర్వహించాలనే ప్రతిపాదన కూడా కొందరు కాంగ్రెస్ నేతలు చేశారు. కానీ భద్రతా కారణాలతో ప్రియాంక పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఆమె స్టేడియానికి వెళ్లనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE