స్విట్జర్లాండ్ లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్)-2023 వార్షిక సదస్సులో పలు అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ అధికారుల బృందం అనేక ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. మంత్రి కేటీఆర్ తో కీలక చర్చల అనంతరం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు పలు కంపెనీలు ప్రకటిస్తున్నాయి. తాజాగా బ్యాటరీల తయారీలో అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో రూ.750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దేశంలోనే మొట్టమొదటి మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ ఎల్ఎఫ్పీ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్టు అలాక్స్ సంస్థ ప్రకటించింది. లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీలు ఈ తయారీ కేంద్రంలో ఉత్పత్తి కానున్నాయి. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్ సమక్షంలో అలాక్స్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నారు. అలాక్స్ సహ వ్యవస్థాపకుడు అండ్ ఎండీ మౌర్య సుంకవాల్, సీఓఓ కిరీటి వర్మ దావోస్లో మంత్రి కేటీఆర్ ను కలిసిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణలో ముందుగా రూ.210 కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు గిగా వాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామని అలాక్స్ తెలిపింది. అలాగే ఈ సామర్థ్యాన్ని భవిష్యత్తులో పది గిగావాట్లకు పెంచుతామని, 2030 సంవత్సరం నాటికి మొత్తంగా 750 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్టు తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా 600 మంది హై స్కిల్డ్ మరియు సెమీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి ఉపాధి లభిస్తుందని చెప్పారు. అలాక్స్ సంస్థను రాష్ట్రానికి స్వాగతించిన మంత్రి కేటీఆర్, అలాక్స్ ప్రతిపాదిత సదుపాయం ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించే తెలంగాణ లక్ష్యానికి మరింత దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ మరియు పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్ఆర్ఐ వ్యవహారాలు ప్రత్యేక కార్యదర్శి ఈ.విష్ణు వర్ధన్ రెడ్డి, ఆటోమోటివ్ డైరెక్టర్ గోపాలకృష్ణన్ పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE