తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి కరీంనగర్లో జరిగిన కళోత్సవాల ముగింపు సభకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందేమాతరం శ్రీనివాస్, శివారెడ్డి, రోజారమణి, గంగవ్వ, తదితర కళాకారులను కేటీఆర్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణంతో తనకు ప్రత్యేక అనుబంధముందని, తాను ఇక్కడే పుట్టానని, కొన్ని సంవత్సరాలు విద్యాభ్యాసం కూడా చేశానని తెలిపారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్కు కూడా కరీంనగర్పై చాలా ప్రేమ ఉందని, 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ స్థాపిస్తే, మే 17న కరీంనగర్ గడ్డపై సింహగర్జన పేరుతో తొలి బహిరంగ సభ నిర్వహించిందని గుర్తు కేటీఆర్ చేశారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ మాట ఎంత పవర్ఫుల్గా పేలిందో.. తెలంగాణ కళాకారుల ఆటా, పాట కూడా అంతే పవర్ఫుల్గా పేలిందని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. నాడు కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతోనే తెలంగాణ సాధించుకున్నామని, నేడు అదే కరీంనగర్లో సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయం మరో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి తెలంగాణ ప్రజలందరి మద్దతు కావాలని, వారి ఆశీర్వాద బలంతో ఆయన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తారని పేర్కొన్నారు. తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము రేపుతున్నాయని, అదేవిధంగా రేపు కేసీఆర్ ప్రకటించబోయే తెలుగు పార్టీ కూడా దుమ్మురేపటానికి రెడీగా ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY