తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన నిజాంసాగర్లో మంజీర నదిపై రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనను, జక్కాపూర్ శివారులో నాగమడుగు మత్తడి పనుల పైలాన్ ఆవిష్కరించారు. అలాగే వీటితో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం జుక్కల్ అక్కడ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని తెలంగాణ ప్రజానీకానికి పిలుపునిచ్చిన ఆయన, తద్వారా ఈ దేశానికి స్పష్టమైన సందేశం ఇద్దామని పేర్కొన్నారు.
ఇంకా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు వచ్చిందని, అయితే ఈ దేశంలో అద్భుతమైన మహానటుడు ఉన్నారని, ఆయనను పంపితే నటనలో కూడా ఆస్కార్ తప్పకుండా వచ్చేదని వ్యాఖ్యానించారు. ఆయన మరెవరో కాదని, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని తెలిపారు. ఇక ప్రధాని మోదీని మహానటుడు అని తాను ఊరికే అనడం లేదని, 2014లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, అయితే ఆ తరువాత వాటి ఊసే ఎత్తడం లేదని అన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తానని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, 100 రోజుల్లో నల్లధనం తెచ్చి ప్రజల ఖాతాల్లోకి వేస్తానని చెప్పారని.. కానీ తొమ్మిదేళ్లు గడుస్తున్నా వీటిలో ఒక్కటీ జరుగలేదని మంత్రి తెలిపారు. ఇచ్చిన హామీలను గుర్తు చేసి ప్రశ్నిస్తుంటే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలచే దాడులు చేయిస్తున్నారని.. అయితే ఇలాంటివాటికి భయపడేది లేదని, తప్పు చేశామో, ఒప్పు చేశామో ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE