హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మికుంటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్లనే ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రజలకు తెలిశాడని పేర్కొన్నారు. 2004 సమయంలో హుజూరాబాద్లో టికెట్ కోసం దాదాపు 33 మంది పోటీ పడ్డారని, అయితే వారందరినీ కాదని కేసీఆర్ ఈటల రాజేందర్కు టికెట్ ఇచ్చారని తెలిపారు.
ఈ విధంగా తనకు రాజకీయ జన్మనిచ్చిన తండ్రిలాంటి సీఎం కేసీఆర్పైన, ఆయన పాలనపైన ఈనాడు ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. సీఎం కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి పట్టిన అరిష్టమని ఈటల వ్యాఖ్యానించడంపై మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇక 14 నెలల కిందట హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిస్తే పింఛన్ రూ.3,000 చేస్తామని హామీ ఇచ్చారని, అలాగే హోంమత్రి అమిత్ షాను నియోజకవర్గానికి తీసుకొచ్చి కేంద్రం నుంచి పుష్కలంగా నిధులు తెస్తామన్నారని, ఆ హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. అసలు ఈటల రాజేందర్ అనే వ్యక్తిని హుజురాబాద్కు పరిచయం చేసింది సీఎం కేసీఆర్ అని తెలిపారు.
అయితే ఈటల రాజేందర్ ఇప్పుడు అవన్నీ మర్చిపోయి తనకు రాజకీయంగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ను, పార్టీని దూషిస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి పాలన దేశానికి అరిష్టమో ఈటలకు తెలియదా? అని అడిగిన మంత్రి, ప్రజల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని చెప్పిన మోదీ ఆ డబ్బు ఎవరి ఖాతాల్లో వేశారని, రాష్ట్రానికి ఢిల్లీ నుంచి ఒక్క పైసా అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ప్రధాని మోదీని దేవుడు అంటున్నారని, మోదీ ఎవరికి దేవుడు? రూ.400 ఉన్న గ్యాస్ ధర రూ.1,000 చేసినందుకు దేవుడా?, నిత్యావసర ధరలు పెంచినందుకు దేవుడా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE