తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి. బుధవారం ఆయన పాలకుర్తి జిల్లాలో ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చినట్లు చెప్పుకొంటున్న కేసీఆర్కు రెండు సార్లు పట్టం కట్టారని, అయితే ఆయన ప్రజల సమస్యలు వదిలేసి జాతీయ రాజకీయాలు అంటూ ఊహల్లో విహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని రేవంత్ కోరారు. కాంగ్రెస్ నేతలు మరియు కార్యకర్తలందరూ సమిష్టిగా 10 నెలలు కష్టపడాలని, తద్వారా 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ దుఃఖం 10 నెలల్లో పోతుందని పేర్కొన్నారు.
ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనని, పెళ్లికి వెళ్లినా, తద్దినానికి వెళ్లినా, కల్లు కాంపౌండ్కు వెళ్లినా, బార్కు వెళ్లినా ఇదే చర్చ జరగాలని రేవంత్ ఆకాంక్షించారు. 2024 జనవరి 1న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అలాగే ప్రభుత్వంలో 2 లక్షలు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, తాము వచ్చిన ఏడాదిలోగా వాటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా బీసీ విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలనూ చెల్లిస్తామని తెలియజేశారు. అదేవిధంగా రూ.800 కోట్లు ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించి, రూ.2 లక్షలుగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచుతామని కూడా ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE