హైదరాబాద్ నగరంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఉదయం బంజారాహిల్స్లో రోడ్ నెంబరు 14లో ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లారు. ముందుగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రి తలసాని ప్రసంగించారు. ఆ సందర్భంగా భట్టి విక్రమార్క స్పందిస్తూ, అసలు నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ కడుతున్నారో చూపించాలని సవాల్ విసిరారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్నికలప్పుడే గుర్తుకు వస్తాయని భట్టి విక్రమార్క విమర్శించారు. దీంతో భట్టి సవాల్ను మంత్రి తలసాని స్వీకరించి, ఇళ్ల నిర్మాణాలను స్వయంగా చూపిస్తానని సభలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో జీహెఛ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి మంత్రి తలసాని భట్టి ఇంటికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను చూపిస్తామని, తమతో రావాలని భట్టిని కోరారు. ఇందుకు భట్టి అంగీకరించి, తలసానితో కలిసి ఒకే కారులో ఇళ్ల నిర్మాణాలు పరిశీలించడానికి బయలుదేరారు. జియాగూడ సహా పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఇద్దరూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించనున్నారు. మరోవైపు భట్టి విక్రమార్క వెంట కాంగ్రెస్ నేతలు వీ హనుమంతురావు, పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu