పోడు భూములకు ఫిబ్రవరి నెలలో పట్టాలివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించినందున, దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఇప్పటికే వందశాతం సర్వేను గ్రామ సభల ద్వారా పూర్తి చేశామని అన్నారు. పోడు భూములకు సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను ఫారెస్ట్ రైట్స్ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీల ద్వారా పరిశీలించి లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ గత సంవత్సరం నుండి కొనసాగుతుందని చెప్పారు. పోడు భూముల కు సంబంధించి పత్రాలు జారీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో సోమవారం బీఆర్కేఆర్ భవన్ నుండి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారిలతో కలసి మంత్రి సత్యవతి రాథోడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతీ ఒక్కరికీ పోడు భూములకు పట్టాలివ్వడంతో పాటుగా అడవుల సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తుందని స్పష్టం చేశారు. ఏ ఏ జిల్లాల్లోనైతే పోడు భూములకు అధికంగా దరఖాస్తులు అందాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అర్హులందరికీ పట్టాలివ్వాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాష అని, దీనికి అనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సత్యవతి రాథోడ్ సూచించారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో స్థానిక ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యులను చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అటవీ శాఖ, రెవెన్యూ సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, అన్ని స్థాయిల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసుకొని పట్టా పాస్ బుక్ లను ప్రింట్ చేసి, ఫిబ్రవరి మొదటి వారానికల్లా సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పీసీసీఎఫ్ డోబ్రియాల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, తదితర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE