పవిత్ర రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 29 సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్ విందును నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఇఫ్తార్ విందు ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీంలు నెలరోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని పండుగలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలను గొప్పగా జరుపుకోవాలి అనేది సీఎం కేసీఆర్ ఉద్దేశం అని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ విందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇఫ్తార్ విందుకు వచ్చే ప్రతినిధులకు ప్రత్యేక పాస్ లను జారీ చేయడం జరిగిందని అన్నారు.
పేదలు ముస్లీంలు కూడా రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలి అనే ఆలోచనతో రంజాన్ సందర్భంగా పేద ముస్లీంలకు ప్రభుత్వం తరపున దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 29వ తేదీన నిర్వహించే ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాహనాల పార్కింగ్ కోసం ఎల్బీ స్టేడియం పరిసరాలలో 6 ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఏర్పాట్ల పరిశీలనలో పాల్గొన్న వారిలో మంత్రులతో పాటు ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్, డైరెక్టర్ షహనవాజ్ ఖాసీం, జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఐజీ రంగనాథ్, జాయింట్ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ రవికిరణ్ తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ