తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం ఆర్థికంగా వెనకబడిన వారిని అభివృద్ధిలోకి తీసుకొనిరావాలనే ఉద్దేశంతో తీసుకొనిరావడం జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం హరిహరకళాభవన్ లో జరిగిన హైదరాబాద్ జిల్లా పరిధిలోని నియోజకవర్గ దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో హోం శాఖ మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మరో అంబేద్కర్ లాంటి వారని అన్నారు. ఆర్ధికంగా దళిత కుటుంబాలు బాగుపడాలనే ఉదేశ్యంతో ఈ పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని, లబ్ధిదారులు పది లక్షల రూపాయలు తీసుకొని వ్యాపారాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్లాలని చెప్పారు. వ్యాపారంపై వచ్చే లాభాన్ని మాత్రమే అవసరాలకోసం ఉపయోగించుకోవాలని అన్నారు.
అలాగే ఈ అవగాహన సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, అంటరానితనాన్ని రూపుమాపాలి, దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం అని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు దాటినా దళితులు అభివృద్ధికి నోచుకోలేదని, దళితులను అత్యున్నత స్థాయికి చేర్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని వివరించారు. దళిత బంధు క్రింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం క్రింద లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయా రంగాలలో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.
మొదటి దశలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 100 మందికి దళితబంధును ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. రెండో విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 1500 మందికి ఈ కార్యక్రమం వర్తింప చేయడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇంతటి సాహసోపేత కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దళితులు సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్నప్పటికీ, సామాజికంగా ఎంతో వెనుకబడిపోయారని, వారు అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే దళిత బంధు క్రింద ప్రతి ఒక్క అర్హులైన దళితులకు ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమానికి ముందు అనేక ఆరోపణలు, విమర్శలు చేశారని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. అదేవిధంగా దళిత బంధు పథకం ప్రారంభ సమయంలో కూడా అనేక విమర్శలు వచ్చాయని పేర్కొన్నారు. లబ్దిదారులు కూడా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ మాట్లడుతూ, ఒక్కప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్ధిక సహాయం పొందాలంటే చాలా కష్టంగా ఉండేది, కానీ నేడు సీఎం కేసీఆర్ ప్రతి దళిత కుటుంబంలో వెలుగు రేఖలు నింపడానికి ఈ దళిత బంధు తీసుకొని రావడం జరిగిందన్నారు. ఇప్పుడు మీరు లక్షాదికారులు త్వరలో మీరు కోటిశ్వర్లు కావాలని తన ఆకాంక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ