తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం నాడు ప్రత్యేక చరిత్రను సృష్టిస్తూ నల్లమల మారుమూల ప్రాంతల్లోని అడవుల్లోకి వెళ్లి ఆదిమ చెంచు గిరిజన తెగ ప్రజలను, నివాసాల్లో సందర్శించి వారితో సంభాషించారు. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాపూర్ చెంచు గిరిజన ఆవాసాన్ని సందర్శించేందుకు, గవర్నర్ పదిహేను కిలోమీటర్ల దట్టమైన అడవుల్లో పూర్తిగా కఠినమైన మార్గం గుండా ప్రయాణించారు. గవర్నర్ గిరిజనుల గుడిసెలను, తాత్కాలిక ఆవాసంలో ఉన్న చెంచు గిరిజన దేవాలయాన్నిసందర్శించి, ప్రార్థనలు చేసి గిరిజన పూజారి ఆశీర్వాదం పొందారు. ఆదిమ గిరిజన సమూహాల ప్రజల పోషకాహార స్థితిని మెరుగుపరచడానికి అప్పాపూర్, బౌరాపూర్ చెంచు ఆవాసాలలో గవర్నర్ ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా, ఆమె ఈ కఠినమైన యాత్రను చేపట్టారు. గవర్నర్ పర్యటన పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, చెంచు గిరిజనులు తమ సంప్రదాయ శైలిలో ఆమెకు ఘనస్వాగతం పలికారు.
ఈ పర్యటనలో మారుమూల గిరిజన ఆవాసాలలోని గుడిసెలను సందర్శించి ప్రజల జీవన స్థితిగతులను గవర్నర్ అర్థం చేసుకున్నారు. ఇంకా మహిళలు, పిల్లలు, ఇతర గ్రామ పెద్దలతో మాట్లాడారు.అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు వీలుగా అప్పాపూర్, బౌరాపూర్ గ్రామాలకు రెండు ద్విచక్ర వాహనాల అంబులెన్స్లను గవర్నర్ అందజేశారు. ద్విచక్ర వాహనాల అంబులెన్స్లు ఆయా గ్రామాల్లోనే ఉండనున్నాయి. వినయం, అమాయకత్వానికి పేరుగాంచిన చెంచు ఆదివాసీ గిరిజన ప్రజల ఉత్సాహభరితమైన స్పందనతో సంతోషించిన గవర్నర్ డా. తమిళిసై ఈ ప్రత్యేక పర్యటన శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, “చెంచు గిరిజన ఆవాసాల సందర్శన నిజంగా సంతృప్తికరంగా ఉంది, అడవులలో మారుమూలగా నివసించే ఆదివాసీ గిరిజన ప్రజల జీవితం, జీవన స్థితిగతులపై నాకు కొత్త అంతర్ దృష్టి కల్గిందని” అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని ఆరు ఆదివాసీ గిరిజన ఆవాసాలలో ఆమె చేపట్టిన పైలట్ ప్రాజెక్టును పలు గ్రామాలలో అమలు చేసిన ఫలితాలను సరిగ్గా అంచనా వేసి, మరికొన్ని ఆవాసాలకు విస్తరించనున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా ప్రజల పోషకాహార స్థితిని మెరుగుపరచడం, ఆదిమ గిరిజన సమూహాల ప్రజల ఆరోగ్యం, విద్య, జీవనోపాధి పరిస్థితులను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పాఠశాలల మరమ్మతులు, ఆరోగ్య ఉప కేంద్రాల ఏర్పాటు, నీరు, పారిశుద్ధ్య సౌకర్యాల వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఈ పైలట్ ప్రాజెక్ట్లో మరో ప్రధాన అంశం. గవర్నర్ పైలట్ ప్రాజెక్ట్ వల్ల గ్రామంలోని అన్ని ఇళ్లకు సోలార్ పవర్ బేస్డ్ లైటింగ్ను విస్తరింపజేయగా, ఆశ్రమ పాఠశాలకు రూపురేఖలు మారాయి. ఈఎస్ఐసీ వైద్య బృందం మహిళలకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ నిర్వహించగా, ఇండియన్ రెడ్క్రాస్ వారు సొసైటీ ఆరోగ్య, పరిశుభ్రత కిట్లను పంపిణీ చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మహిళలకు వారి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సాంప్రదాయ మహువ లడ్డూను పంపిణీ చేసింది, ఇంకా అవసరమైన వారికి మందులు పంపిణీ కూడా జరిగింది.
ఈ పర్యటనలో భాగంగా రెండు ఆదివాసీ గిరిజన ఆవాసాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం 49.9 లక్షల రూపాయల చెక్కును గవర్నర్ అందజేశారు. ఇద్దరు పీజీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. ఇంకా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి గ్రామ యువకులకు పోటీ పరీక్షల మెటీరియల్ను కూడా పంపిణీ చేశారు. ఆవాసాలను మళ్లీ సందర్శించి అభివృద్ధిని అంచనా వేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. మహిళల ఆరోగ్యం, పోషకాహార స్థితి గురించి ఆందోళన చెందుతున్నారని, వారి ఆరోగ్యం మరియు పోషకాహార స్థితిని మెరుగుపరచడానికి నిరంతరాయంగా కృషి చేయాలని ఈ సందర్భంగా గవర్నర్ పిలుపునిచ్చారు. సర్పంచ్లు, గ్రామస్తులు చేసిన విజ్ఞప్తులపై స్పందించిన గవర్నర్ సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. గవర్నర్ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, గవర్నర్ జాయింట్ సెక్రటరీ సి.ఎన్.రఘుప్రసాద్, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ మను చౌదరి, ఎస్పీ మనోహర్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐఆర్సిఎస్, ఐటిడిఎ, అటవీ శాఖ, జిల్లా పరిపాలనలోని ఇతర ఏజెన్సీలు గవర్నర్ సందర్శనను సమన్వయం చేశాయి. గవర్నర్ పర్యటనతో మారుమూల గిరిజన ఆవాసాలకు పండుగ వాతావరణం నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ