నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. పోలింగ్ ప్రక్రియలో భాగంగా మొత్తం 298 పోలింగ్ కేంద్రాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలతో పాటుగా స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఈ ఉపఎన్నికలో మునుగోడు నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఉదయం 9 గంటల వరకు 11.2% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక ప్రతి పోలింగ్ బూత్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ జరుగుతున్న తీరును అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం, నారాయణపూర్ మండలంలోని తన స్వగ్రామంమైన లింగవారిగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు, అలాగే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చండూరు మండలంలోని ఇడికూడ లోని 173వ పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నకిరేకల్ నియోజకవర్గంలోని బ్రాహ్మణవెల్లంలో ఓటు ఉండడంతో ఇక్కడ ఓటువేసే అవకాశం లేకుండా పోయింది.
తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఆసక్తికరంగా మారిన మునుగోడు పోరులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీజేఎస్ సహా వివిధ పార్టీలు, అలాగే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, ఇతర స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 47 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఉపఎన్నికల్లో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీల కీలక నేతలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, మునుగోడులో దాదాపు నెల రోజుల పాటుగా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడంతో ఎవరు విజయం సాధిస్తారనే ఆసక్తి ప్రజల్లో నెలకుంది. ఇక నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితం వెల్లడించనున్నారు.
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ వివరాలు:
- బరిలో ఉన్న అభ్యర్థులు: 47
- ఓటర్ల సంఖ్య : 2,41,855
- పురుష ఓటర్లు : 1, 21, 720
- మహిళా ఓటర్లు : 1, 20, 128
- ఇతరులు : 07
- సర్వీస్ ఓటర్లు: 50
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: 5,686
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దరఖాస్తు చేసుకున్నవారు : 739
- పోలింగ్ కేంద్రాలు:: 298
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 105
- పోలింగ్ సిబ్బంది : 2500
- విధుల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర బలగాలు: 5000.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE