ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ కాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే విరసం కార్యదర్శిగా ప్రొఫెసర్ కాశీం ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఈ రోజు ఉదయం 5 గంటల పాటు కాశీం నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు, విప్లవ సాహిత్య పుస్తకాలు, కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అనంతరం కాశీంను పోలీసులు అదుపులోకి తీసుకుని గజ్వేల్కు తరలించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రొఫెసర్ కాశీంను అక్రమంగా అరెస్ట్ చేసారంటూ పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న కొంతమంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రోఫెసర్ కాశీం అరెస్ట్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఖాసీం ఇంటిపై దాడి ప్రజాస్వామ్యంపైనే దాడి చేయడం లాంటిదని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎమెర్జెన్సీని తలపిస్తుందని మండిపడ్డారు. అలాగే కాశీం ఇంట్లో సోదాలు, అరెస్టును సీపీఐ నేత నారాయణ ఖండించారు. కాశీంపై అనవసరంగా దాడులు చేసి హింసిస్తున్నారని అన్నారు. మరో వైపు కాశీం అరెస్ట్ పై హైకోర్టులో పౌరహక్కుల సంఘం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై ఈ సాయంత్రం విచారణ జరగనుంది.
[subscribe]