హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన ఫిబ్రవరి 5, శనివారం సాయంత్రం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ముచ్చింతల్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు గలిగిన పంచలోహ శ్రీరామానుజాచార్య విరాట్ (సమతామూర్తి) విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. మొత్తం 45 ఎకరాల విస్తీర్ణంలో రూ.1200 కోట్ల వ్యయంతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. వసంత పంచమి పర్వదినం సందర్భంగా ముచ్చింతల్ లో ప్రధాని మోదీచే సమతామూర్తి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.
త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మైహోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోదీ, శ్రీ చినజీయర్ స్వామి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రసంగించారు. ముందుగా ముచ్చింతల్ చేరుకున్న ప్రధాని మోదీ యాగశాలలో నిర్వహించిన విష్వక్సేనేష్టి యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి శ్రీచిన్నజీయర్ స్వామి కంకణాన్ని కట్టారు. యాగశాల చుట్టూ మోదీ ప్రదక్షిణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 108 ఆలయాలతో నిర్మించిన దివ్యదేశ ఆలయాల సమూహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానికి శ్రీచిన్నజీయర్ స్వామి దివ్య దేశాల విశిష్టత గురించి వివరించారు. శ్రీరామానుజచార్యుల విగ్రహంపై 15 నిమిషాల పాటు సాగిన 3డీ లైటింగ్ ప్రదర్శన వీక్షించారు. అనంతరం మరోసారి యాగశాలకు చేరుకుని శ్రీలక్ష్మీనారాయణ యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం తర్వాత, ప్రధాని మోదీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి తిరిగి పయనమయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ