దేశంలోనే అత్యద్భుతమైన రామాలయం మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 22న జరగనున్న ఈమహత్కార్యాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు యూపీ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆలయ నిర్మాణం పూర్తికాకముందే ఆలయాన్ని ప్రారంభించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడడంతో బీజేపీ ఆలయ నిర్మాణం పూర్తికాకముందే ప్రారంభిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్తో పాటు పలువురు పీఠాధిపతులు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాబోమని తేల్చి చెప్పారు.
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రామమందిర ప్రారంభోత్సవంపై స్పందించారు. ప్రస్తుతం దావోస్లో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి.. ఆక్కడ మీడియాతో మాట్లాడుతూ రామాలయ ప్రారంభోత్సవంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయోధ్య రామాలయంలో రాంలల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని బీజేపీ సొంత కార్యక్రమంగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రామాలయం ప్రతి ఒక్క హిందువుకూ చెందుతుందని అన్న రేవంత్ రెడ్డి.. బీజేపీ మాత్రం ఈ కార్యక్రమాన్ని రాజకీయంగా వాడుకుంటోందని ఆరోపించారు.
రామ మందిర నిర్మాణం పూర్తికాకముందే ప్రారంభించడం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ రామ మందిరాన్ని, హిందూయిజాన్ని అడ్డు పెట్టుకొని మత రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. రామ మందిరం పూర్తిగా నిర్మించకముందే ప్రారంభించడానికి గల కారణాలు అందరికీ తెలిసినవేనని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అసంపూర్తిగా నిర్మించిన ఆలయంలో శ్రీరాముడికి ప్రాణప్రతిష్ట చేసే కార్యక్రమానికి నిజమైన హిందువులు ఎవరూ వెళ్లరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లడం లేదో రేవంత్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాజకీయంగా వాడుకుంటోందని.. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆ కార్యక్రమానికి వెళ్లదలచుకోలేదని స్పష్టం చేశారు. తనకు భద్రాచలంలోని రామాలయం అయినా.. అయోధ్యలోని రామమందిరం అయినా తనకు ఒక్కటేనని రేవంత్ చెప్పుకొచ్చారు. ఆయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయిన తర్వాతే తాను వెళ్లి రాములోరిని దర్శించుకుంటానని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE