తెలంగాణలో జూన్ 15 నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగోరోజైన జూన్ 18, శుక్రవారం నాడు జరిగే రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం నాడు మొత్తం 7.05 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1153.50 కోట్లు జమకానున్నాయని తెలిపారు. నాలుగో రోజున నల్గొండ జిల్లాలో అత్యధికం 53,381 మంది రైతులకు 1,82,542 ఎకరాలకు గాను రూ.91.27 కోట్లు, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2300 మంది రైతులకు 7212 ఎకరాలకు గాను 36.05 లక్షలు అందించనున్నట్టు తెలిపారు.
మరోవైపు గత మూడు రోజులలో రాష్ట్రవ్యాప్తంగా 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2942.27 కోట్లు పంపిణీ జరిగిందని, నాలుగు రోజు అందించే రూ.1153.50 కోట్లతో కలిపి రైతుబంధు కింద రైతుల ఖాతాలలో మొత్తం రూ.4095.77 కోట్లు జమచేసినట్టు అవవుతుందన్నారు. కరోనా లాంటి విపత్తులోనూ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది వ్యవసాయరంగమేనని మంత్రి పేర్కొన్నారు.
“60 శాతం మంది ప్రత్యక్ష్యంగా, మరో 20 శాతం మంది పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగం బాగుండాలని ముందుచూపుతో సీఎం వ్యవసాయరంగానికి చేయూతనిస్తున్నారు. రైతుబంధు, రైతు భీమా, ఉచిత కరంటు సరఫరాతో పాటు వంద శాతం పంటల కొనుగోళ్లతో రైతులకు అండగా నిలుస్తున్నారు. అందుకే కరోనా విపత్తులోనూ గత వానాకాలం, మొన్న యాసంగిలో కలిపి రూ.14656.02 కోట్లు, ఈ వానాకాలంలో రూ.7508.78 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. రైతుబంధు, ఉచితకరంటు , రైతుభీమా పథకాలతో తెలంగాణలో సాగు దశ, దిశ మారుతుంది” అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ