ఎమ్మెల్సీ కవితకు శుక్రవారం బిగ్ రిలీఫ్ దొరికినట్లు అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేసీఆర్ తనయ కవితకు ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ సెప్టెంబర్ 14న మరోసారి నోటీసులు జారీ చేయడంతో రాజకీయ సర్కిల్లో హీటు ఒక్కసారిగా పెరిగినట్లు అయింది. ఇక రేపో, మాపో కవిత అరెస్ట్ తప్పదంటూ గట్టిగా వార్తలు వినిపించాయి.
ఇప్పటికే ఏపీలో మాజీ సీఎం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. ఇక తెలంగాణలో సీఎం కూతురు అరెస్ట్ మాత్రమే మిగిలిందంటూ వార్తలు జోరుగా చక్కర్లు కొట్టాయి. అయితే ఈడీ నోటీసులపై వెంటనే స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాత్రం ఈడీ నోటీసులను లైట్ తీసుకున్నట్లే కనిపించారు. అవి ఈడీ నోటీసులు కాదు.. మోడీ నోటీసులు అంటూ మీడియా ముందు సెటైర్లు వేశారు.
దానికి తగ్గట్లే వెంటనే కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అక్కడ సెప్టెంబర్ 26 వరకు కవితకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని ధర్మాసనం.. ఈడీని ఆదేశించింది. అంతే కాదు దీనిపై వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.అయితే ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ..మూడు సార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది.
తాజాగా గురువారం అంటే.. సెప్టెంబర్ 14న మరోసారి నోటీసులిచ్చింది. ఆ మర్నాడు అంటే సెప్టెంబర్ 15న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. దీంతో ఈడీ నోటీసులకు వ్యతిరేకంగా.. ఎమ్మెల్సీ కవిత ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. నళినీ చిదంబరంలాగే తమకూ ఊరట కల్పించాలని ధర్మాసనాన్ని కోరారు.
కవిత దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ముందుగా ఈ పిటిషన్పై ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ స్పందనను ధర్మాసనం కోరింది. అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు. దీంతో సెప్టెంబర్ నెల 26 వరకు కవితకు నోటీసులు జారీ చేయొద్దని సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్ డైరెక్టరేట్కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE