స్వాతంత్య్ర పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగానే తెలంగాణలో పరిపాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. “బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించి, భారతదేశ స్వేచ్ఛకూ, సార్వభౌమాధికారానికీ ప్రతీకగా త్రివర్ణపతాకం ఆవిష్కృతమై నేటితో 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ వజ్రోత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకూ, యావత్ భారతజాతికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని అన్నారు.
“భారత స్వాతంత్య్రం కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో మన తెలంగాణ నుంచి కూడా అనేకమంది వీరులు బలమైన పాత్రను పోషించారు. తుర్రేబాజ్ ఖాన్, రాంజీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, భారత కోకిల సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు మొదలైన వారు సాహసోపేతంగా చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వాతంత్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రజల పిలుపు మేరకు హైదరాబాద్ ను సందర్శించిన గాంధీజీ తెలంగాణ ప్రజల సామరస్య జీవనశైలిని గంగా జమునా తెహజీబ్ గా అభివర్ణించడం, మనకు గర్వకారణం” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
“అదేవిధంగా స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ క్రమంలో స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా మారింది. స్వాతంత్య్ర పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగానే తెలంగాణలో పరిపాలన సాగిస్తున్నాం. నేడు ప్రతీ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. నేడు ప్రతీ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే తెలంగాణ అసాధారణ విజయాలను సొంతం చేసుకుంది” అని సీఎం కేసీఆర్ తెలిపారు.
“సమైక్య రాష్ట్రంలో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ నేడు అన్ని రంగాలకు 24 గంటల పాటు అత్యుత్తమ విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది. ఇంటింటా నల్లాలతో స్వచ్ఛమైన తాగునీటిని 100 శాతం గ్రామాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అలాగే గొర్రెల పెంపకంలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. గ్రామీణ జీవన ప్రమాణాల్లో దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ. వ్యవసాయం దాని అనుబంధ రంగాల పరిమాణం రెండున్నర రెట్లు పెరిగింది. ఇక పారిశ్రామిక రంగం రెండు రెట్లు, సేవా రంగం 2.2 రెట్లు పెరిగాయి. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల అన్ని రంగాల్లోనూ అభివృద్ధి గతంకన్నా రెట్టింపు స్థాయిలో జరిగింది” అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY