తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం బాలానగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) లో భాగంగా 6 లేన్లతో కూడిన 1.13 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ ను రూ.385 కోట్ల వ్యయంతో నిర్మించారు. 24 మీటర్ల వెడల్పుతో, 26 పిల్లర్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని 3 సంవత్సరాల 11 నెలల సమయంలో పూర్తి చేశారు. బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభంతో ఈ ప్రాంతం మీదుగా పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ లోనే అత్యంత ఎక్కువుగా ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొనేది బాలానగర్ జంక్షన్ అని చెబుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.30 వేల కోట్లతో ప్రణాళికలు చేపట్టామని, మొదటిదశలో రూ.6 వేల కోట్లతో వివిధ అండర్ పాస్ లు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టామన్నారు. ఒక్క కూకట్ పల్లి నియోజకవర్గపరిధిలోనే రూ.1000 కోట్లతో ఫ్లైఓవర్లు, రహదారి విస్తరణ పనులు చేపట్టామన్నారు. జీహెఛ్ఎంసీ, హెఛ్ఎండీఏ ఈ రెండూ కూడా సంయుక్తంగా హైదరాబాద్ నగరంలో బ్రహ్మాండమైన అభివృద్ధి పనులు చేపడుతున్నాయని చెప్పారు. బాలానగర్ ఫ్లైఓవర్ ను హెఛ్ఎండీఏ ద్వారా నిర్మించామని, ఈ ఫ్లైఓవర్ కు బాబు జగ్జీవన్ రామ్ పేరు పెడుతున్నామని, దీనిపై అధికారిక ఉత్తర్వులు విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా కార్మికులను గౌరవించుకోవడంలో భాగంగా ఈ ప్రాజెక్టులో గత రెండు సంవత్సరాలుగా పనిచేసిన శివమ్మ అనే కార్మికురాలితో ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేయించినట్టు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రావు, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ