తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మార్చ్ 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. మార్చి 6న ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, అదే రోజున ఉభయ సభలను(శాసన సభ, శాసన మండలి) ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. మార్చ్ 7వ తేదీన గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లోనూ చర్చ జరుగుతుంది. ఇక 2020-21 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మార్చ్ 8 లేదా 10వ తేదీల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎనిమిదో తేదీ ఆదివారం కావడం, ఆ తర్వాత సోమవారం హోలీ రావడంతో బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) మీటింగ్ లో చర్చించి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజుతో పాటుగా, బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజుల పాటుగా నిర్వహించాలో కూడా నిర్ణయించనున్నారు. ఈసారి ఆర్థిక మంత్రి హోదాలో హరీష్ రావు మొదటిసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు, అలాగే శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెడతారు.
[subscribe]