సోమవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలలో (శాసనసభ, శాసన మండలి) సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం సమావేశాలు మొదలైన వెంటనే ఇటీవలే మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా రెండు నిమిషాలపాటు సభ సంతాపం తెలిపింది. అనంతరం సీఎం కేసీఆర్ గతవారం బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సభ ముందు ఉంచారు. ఈ క్రమంలో మంత్రులు పలు బిల్లులు ప్రవేశపెట్టారు. ముందుగా తెలంగాణ జిఎస్టి అమెండ్మెంట్ బిల్ 2022 సీఎం కేసీఆర్ ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉండగా మంత్రి తలసాని బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రి కేటీఆర్ మున్సిపల్ లాస్ అమెండ్మెంట్ బిల్, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ తదితర బిల్లులను సభ ముందు ఉంచగా, మంత్రి హరీష్ రావు వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణకు సంబంధించిన బిల్లుతో పాటు తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ బిల్లు ప్రవేశపెట్టారు.
అలాగే తెలంగాణ యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మోటర్ వెహికిల్స్ టాక్సేషన్ అమెండ్మెంట్ బిల్లును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రవేశపెట్టారు. ఇక యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ ముందుకు తెచ్చారు. మంత్రి జగదీశ్ రెడ్డి విద్యుత్ శాఖ బిల్లుని ప్రవేశపెట్టగా, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు, అనంతర పరిణామాలపై లఘు చర్చను ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రారంభించారు. దీనిలో భాగంగా.. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ యాన్యువల్ రిపోర్టు, తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రిపోర్ట్, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రిపోర్టు, మరియు తెలంగాణ స్టేట్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రిపోర్టును సభ ముందు ఉంచారు. కాగా ఇదే అంశంపై శాసన మండలిలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి లఘు చర్చను ప్రారంభించారు. ఇక రెండో రోజు శాసనసభలో ఏడు బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. అలాగే రెండో రోజు అసెంబ్లీ, మండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని సస్పెండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY