తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఉదయం “నిరుద్యోగ దీక్ష” ప్రారంభించారు. ముందుగా ఈ దీక్షను ఇందిరాపార్కు వద్ద చేపట్టాలని భావించినప్పటికీ, అమలులో ఉన్న ఆంక్షలు దృష్ట్యా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. బండి సంజయ్ దీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమవగా, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. బండి సంజయ్ దీక్షకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, విజయశాంతి సహా పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో యువతకు భరోసా ఇచ్చేందుకు, ప్రభుత్వ తీరును నిలదీసేందుకు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిరుద్యోగ దీక్ష చేపడుతున్నట్టు బండి సంజయ్ పేర్కొన్నారు.
మరోవైపు ఆదివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకై బీజేపీ చేపడుతున్న నిరుద్యోగ దీక్షకు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులను, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని అన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి బీజేపీ పార్టీ కార్యాయలంలో నిరుద్యోగ దీక్ష చేపడుతుంటే ప్రభుత్వానికున్న అభ్యంతరం ఏంటి?
టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతీ, యువకుల పక్షాన బీజేపీ చేపడుతున్న నిరుద్యోగ దీక్షకు రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలని ప్రజాస్వామిక వాదులను బండి సంజయ్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ