తక్షణమే వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెరిగిన ధరలకు అనుగుణంగా జులై 1 నుండి జీతాలు చెల్లించాలని, ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 9న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారనే సమాచారం తన దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న అంశాలను బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన సీఎం దృష్టికి తీసుకురాదలిచానని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. అందులో ప్రధానమైనది వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు అంశంమని పేర్కొన్నారు.
కీలకమైన పీఆర్సీ ఏర్పాటు, అమలు విషయంలోనూ తీవ్రమైన కాలయాపన చేస్తున్నారని, స్వరాష్ట్రంలో సీఆర్ బిస్వాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తొలి పీఆర్సీ నివేదిక అమలులో మీరు చేసిన జాప్యం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు 21 నెలల పాటు పెంచిన జీతాన్ని నష్టపోయారని అన్నారు. ఈ ఏడాది జూన్ 30 నాటితో మొదటి పీఆర్సీ గడువు కూడా ముగియబోతుండగా, జూలై 1, 2023 నుండి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాలని, కానీ ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ను నియమించలేదని పేర్కొన్నారు. పే రివిజన్ కమిషన్ నివేదిక లేకుండా పీఆర్సీని ఎట్లా అమలు చేస్తారు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కొత్త పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ని ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నామని, దీంతో పాటు 3 నెలల గడువు విధించి నివేదిక తెప్పించుకుని ఈ ఏడాది జూలై నుండి కొత్త పీఆర్సీని అమలు చేయాలని కోరుతున్నామన్నారు. త్వరలో జరగబోయే కేబినెట్ భేటీలో ఆ అంశంపై చర్చించాలని పేర్కొన్నారు. లేని పక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE