తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేడు (ఏప్రిల్ 12, మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ధాన్యం కొనుగోళ్ళ అంశంపై కీలకంగా చర్చించే అవకాశమునట్టు తెలుస్తుంది. ముందుగా రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ళపై కేంద్రంపై పోరులో భాగంగా సోమవారం సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా పెద్దస్థాయిలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ధాన్యం సేకరణపై ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రానికి సీఎం కేసీఆర్ 24 గంటల డెడ్లైన్ విధించారు. అనంతరం ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ కార్యదర్శి సుధాంషు పాండే మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని స్పష్టం చేశారు. ముడి బియ్యం కొంటామని, ఆ విషయంలో కూడా తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని అన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ళపై నేడు జరిగే కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ అంశంపై కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా మరింత కార్యాచరణ దిశగా కేబినెట్ నిర్ణయం ఉండబోతున్నట్టు సమాచారం. రాష్ట్ర మంత్రులంతా హాజరయ్యే ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ