ఆంధ్రప్రదేశ్ నూతన రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ ఈరోజు లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం మంత్రి విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ.. రవాణా శాఖ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు అని తెలిపారు. ప్రస్తుతం నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని కొద్దీ కాలంలోనే లాభాల బాటలో నడిపిస్తామని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా.. ఆర్టీసీలోకి కొత్తగా 998 బస్సులను తీసుకొచ్చామని, మరో 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తామని వెల్లడించారు.
1987లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లోకి ప్రవేశించిన విశ్వరూప్.. 1998, 99 ఎన్నికల్లో ముమ్మిడివరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అయితే తొలిసారి 2004లో అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించి మొదటిసారి మంత్రి పదవిని చేపట్టారు. 2019లో వైఎస్సార్పీసీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తొలి విడత కేబినెట్లో స్థానం దక్కించుకున్న విశ్వరూప్కు రెండో విడత కేబినెట్లో కూడా స్థానం దక్కటం విశేషం. ఈరోజు రవాణా శాఖ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు.. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు, ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ