తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఏప్రిల్ 11, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగనుంది. కరోనా వైరస్ వ్యాప్తి, దాని వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ఈ కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ పొడిగించే అంశం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ వ్యూహ రూపకల్పన, రాష్ట్రంలోని పేదలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు అందుతున్న సాయం, వ్యవసాయం కొనుగోళ్లు, వడగండ్ల వాన నష్టం తదితర అంశాలు ఈ కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
కాగా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 9, గురువారం నాడు కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 471కు చేరింది. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 12 మృతి చెందగా, 45 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 414 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.