తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 9, గురువారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 12 మృతి చెందగా, 45 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 414 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన హైదరాబాద్ నగరంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి వాటిని హాట్ స్పాట్లు, కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సంయుక్తంగా దృష్టి సారించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించిన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటుగా రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆ ప్రాంతాల పరిధిలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచుతుండగా, కరోనా లక్షణాలు ఉంటే ఆసుపత్రులకు తరలిస్తున్నారు. హైదరాబాద్లో మొత్తంలో 167 కరోనా కేసులు నమోదు అవ్వగా, 89 మంది కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించిన ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ప్రాంతాల్లో అప్రమత్తతతో వ్యవహరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ లో కంటైన్మెంట్ క్లస్టర్లు గా గుర్తించిన ప్రాంతాలు:
- కుత్బుల్లాపూర్ -గాజుల రామారం
- ఆల్వాల్
- మయూరీనగర్
- చందానగర్
- కూకట్ పల్లి
- మూసాపేట
- యూసుఫ్ గూడ
- రామ్ గోపాల్ పేట
- రెడ్ హిల్స్
- మలక్ పేట – సంతోష్ నగర్
- చాంద్రాయణ గుట్ట
- షేక్ పేట