ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 74వ రోజుకి చేరుకున్నాయి. రైతులు, మహిళలు పలు విధాలుగా వారి నిరసనను కొనసాగిస్తున్నారు. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతుల ధర్నా చేస్తుండగా, వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ రోజు నిరసనల్లో భాగంగా తుళ్లూరులో రైతులు వారి దీక్షా శిబిరం నుంచి స్థానిక వైఎస్ విగ్రహం వరకు వెనక్కి నడిచారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. అక్కడ వైఎస్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేలా సీఎం వైఎస్ జగన్ మనసు మార్చాలని పేర్కొన్నారు.
అదేవిధంగా నిరసనల సందర్భంగా రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధాని గ్రామాల్లోని భూములను పేదల ఇళ్ల స్థలాలకోసం కేటాయించడాన్ని కూడా వారు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు తేల్చి చెబుతున్నారు. అలాగే పెనుమాక, రాయపూడి, నేలపాడు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, పెదపరిమితాడికొండతో పాటుగా ఇతర రాజధాని గ్రామాల్లో కూడా రైతుల ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
[subscribe]