తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి శుభవార్త. త్వరలో జరుగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు సీపీఎం పార్టీ మద్దతు తెలిపింది.ఈ మేరకు పార్టీ నిర్ణయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. గురువారం హైదరాబాద్ ఎంబీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ.. మునుగోడులో జరుగనున్న ఉపఎన్నికలలో సపోర్ట్ చేయాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలు తమను కోరాయని, దీనిపై పార్టీలో చర్చించిన మీదట టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బీజేపీతో సిద్ధాంతపరంగా విభేదించే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ఎన్నికలో దానిని ఓడించడానికే టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని భావించామని వీరభద్రం చెప్పారు.
ఇక మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ అవసరార్ధమే ఉపఎన్నికలు వచ్చేలా చేశారని, అభివృద్ది కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పడం హాస్యాస్పదమని తమ్మినేని పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్గా ఉన్న పరిస్థితిని, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా మార్చబోతున్నారని మండిపడ్డారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బలమున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది మూడో స్థానానికి పడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. మునుగోడులో బీజేపీని గెలిపిస్తే కొన్ని నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామని బహిరంగ సభలో అమిత్ షా ప్రకటించారని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో తలెత్తే విపత్కర పరిణామాలను అడ్డుకునేందుకే తమ పార్టీ టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతోందని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కాగా సీపీఎం నిర్ణయంపై టీఆర్ఎస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ