తెలంగాణ రాష్ట్రంలో జిల్లా స్ధాయిల్లో వివిధ శాఖలలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను జనవరి 31 లోగా పూర్తి చేయడంతో పాటు, ఎటువంటి జాప్యం లేకుండా కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం నాడు బిఆర్కెఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో అన్ని కేటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్లు, డిపీసిలు నిర్వహణ, కారుణ్య నియామకాలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, సెగ్రిగేషన్ షెడ్స్, డ్రైయింగ్ ఫ్లాట్ ఫామ్స్, గ్రామ నర్సరీలు, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని కలెక్టర్లకు తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ అంశంపై వెంటనే జిల్లా స్ధాయిలో సమావేశం నిర్వహించి ప్రమోషన్ల ద్వారా నింపే ఉద్యోగ ఖాళీల సంఖ్యను అంచనా వేయాలన్నారు. ప్రతి సోమవారం ప్రమోషన్ల, కారుణ్య నియామాకాలపై సమావేశాలు నిర్వహించి ఈ నెల 24 నాటికి పూర్తి చేయాలన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి హామీ ద్వారా ఈ సీజన్ లో మూడు నెలల ముందుగానే 14.10 కోట్ల పని దినాలు దాటినందుకు అధికారులను అభినందిస్తూ వచ్చే 3 నెలల కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. రైతు వేదికలు, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, డ్రైన్ ప్లాట్ ఫామ్స్, సెగ్రిగేషన్ షెడ్స్, నర్సరీలలో ప్లాంటేషన్ తదితర అంశాలకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, జి.ఎ.డి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, సిఐజి /సి.యం కార్యదర్శి శేషాద్రి, సీనియర్ కన్సల్టెంట్ శ్రీ శివశంకర్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, ఎండీ, టిఎస్ టిఎస్ జి.టి వెంకటేశ్వర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ