హైదరాబాద్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. దివంగత మాజీ మంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నేత పి. జనార్దన్ రెడ్డి కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. తాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు విజయారెడ్డి తెలిపారు. ఆమె శనివారం ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియా ముఖంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ.. మా కుటుంబం మొదటినుంచీ కాంగ్రెస్లోనే ఉందని, తండ్రి పీజేఆర్ కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీ లీడర్గా పనిచేశారని, పార్టీలో చివరివరకూ పార్టీలోనే కొనసాగారని విజయారెడ్డి గుర్తు చేశారు.
ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిశానని, జూన్ 23న కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నట్లు విజయారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణతో పాటు, కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేశానని, అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించానని, అయితే తనకు సరైన గుర్తింపు దక్కలేదని విజయారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జూబ్లీహిల్స్ మైనర్ బాలిక ఘటనపై పార్టీ తరపున మాట్లాడే అవకాశం రాలేదని, దానిపై మాట్లాడలేకపోవడం బాధ కలిగించిందని అన్నారు. కాంగ్రెస్లో ఉంటే ఇలాంటి ఘటనల మీద గట్టిగా మాట్లాడగలమని భావిస్తున్నానని, అందరితో చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నానని, తండ్రి పీజేఆర్ బాటలో నడుస్తానని విజయా రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ