గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఏడాది హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో అధికారికంగా గణతంత్ర వేడుకలు నిర్వహించకూడదని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక రాజ్భవన్లోనే గణతంత్ర వేడుకలను జరుపుకోవాలని గవర్నర్కు లేఖ ద్వారా ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లేఖపై తమిళిసై స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో అధికారికంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించకూడదని నిర్ణయించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్స్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించకపోవడం అంటే ఒకరకంగా ఇది తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయంగానే భావించాల్సి ఉంటుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయని తెలిపిన తమిళిసై, కరోనా కారణాన్ని చూపి తెలంగాణ రాష్ట్రంలో వేడుకలు జరుపకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇటీవలే ఖమ్మంలో 5 లక్షల మందితో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారని గుర్తుచేసిన గవర్నర్.. అప్పుడు లేని కోవిడ్, పరేడ్ గ్రౌండ్స్లో రిపబ్లిక్ డే జరిపితే వస్తుందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తమిళిసై చెప్పారు. కాగా ఈసారి గవర్నర్ రాజ్భవన్లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారని, జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం.. సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరిలో జరిగే వేడుకలకు హాజరవుతారని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా గతేడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలను రాజ్భవన్కే పరిమితం చేయడం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE