తెలంగాణ రాష్ట్రంలో మే 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా రెండో డోసు కరోనా వ్యాక్సిన్ మాత్రమే అందించనున్నారు. వ్యాక్సిన్ డోసుల కొరత దృష్ట్యా అప్పటివరకు మొదటి డోసు కరోనా వ్యాక్సినేషన్ పక్రియను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. “ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించారు. కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రానికి స్వల్పంగా కేటాయించడం ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలో రోజుకు కనీసం 2 లక్షల వ్యాక్సిన్ డోసులను రాష్ట్రానికి అందించాలని ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి విజ్ఞప్తి చేశారు. మే 15 వరకు వ్యాక్సిన్ కేటాయింపులు (4.69 లక్షల కోవిషీల్డ్ మరియు 2.16 లక్షల కోవాక్సిన్) తక్కువగా ఉండడంతో, అందుబాటులో ఉన్న డోసులను సముచితంగా ఉపయోగించుకోవటానికి, రెండవ డోసు తీసుకునేందుకు అర్హత ఉన్నవారిని కవర్ చేయడానికి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించబడింది” అని పేర్కొన్నారు.
రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హత ఉన్నవారికి ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలలో వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని చెప్పారు. మొదటి డోసు తీసుకున్న రోజు నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికీ 6 వారాలు, కోవాక్జిన్ తీసుకున్న వారికీ 4 వారాలు తర్వాత రెండవ డోసు తీసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. రెండవ డోసు తీసుకునేందుకు అర్హత ఉన్న వారందరూ పాక్షిక కరోనా వ్యాక్సినేషన్ ధృవీకరణ పత్రాన్ని చూపించి స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా వ్యాక్సిన్ తీసుకోవడానికి అనుమతి ఉంటుందని తెలిపారు. మే 8 నుండి 12 వరకు ఏ వ్యక్తికైనా మొదటి డోసు వ్యాక్సిన్ ఇవ్వబడదని, మే 9, ఆదివారం నాడు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉండదని ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ