తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు (సెప్టెంబర్ 7, సోమవారం) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అలాగే శాసన మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. సమావేశాలు ప్రారంభం తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పీకర్ సభ్యులకు వివరించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, దేశానికి ప్రణబ్ ముఖర్జీ చేసిన సేవలను గుర్తుచేశారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని సీఎం తెలిపారు. బెంగాల్ లోని చిన్న గ్రామం నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన ప్రణబ్ ఎంతో ఆదర్శమని, కఠోర శ్రమ అంకితభావంతో ఎదిగారన్నారు. దేశంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమస్యలను పరిష్కరించి గొప్ప నేతగా నిలిచారని సీఎం పేర్కొన్నారు. అలాగే ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి కూడా శాసనసభ నివాళులర్పించింది.
మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసెంబ్లీలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సభ్యులతో పాటుగా, సిబ్బంది కూడా మాస్కులు ధరించి, భౌతిక దూర నిబంధనలను పాటిస్తున్నారు. కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వారినే సభలోకి అనుమతించారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒక్కో సీటులో ఒక్కొక్కరే కూర్చునే విధంగా శాసనసభలో 40, శాసన మండలిలో 8 సీట్లను కొత్తగా ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu