తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రామీణ పేదరిక నిర్మాలన సంస్థ.. ‘సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ’ (సెర్ప్) మరియు భారతీయ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ ‘ఫ్లిప్కార్ట్’ పరస్పర ప్రయోజనం కోసం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల వస్తువులు, ఎఫ్పీవోలు సేకరించిన ధాన్యాన్ని ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రముఖ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ ఫ్లిప్కార్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, ఫ్లిప్కార్ట్ ఉపాధ్యక్షుడు రవిచంద్రన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
దీనివలన ఇరు వర్గాలకు దేశవ్యాప్తంగా మార్కెటింగ్ పెరగడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు అందుబాటు ధరలకు లభించనున్నాయి. దీంతో ఫ్లిప్కార్ట్ తన ఆన్లైన్ ప్లాట్ఫారమ్ ద్వారా స్వయం సహాయక బృందాలు (ఎస్హెచ్జిలు) ఉత్పత్తి చేసే వస్తువులను విక్రయించనున్నాయి. ఈ ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా ఎస్హెచ్జిలు నిర్వహించే దుకాణాలు మరియు స్టాల్స్ కూడా ఫ్లిప్కార్ట్ ప్రమోట్ చేసే వస్తువులను విక్రయిస్తాయి. కాగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో ఎస్హెచ్జిల ద్వారా 60 స్త్రీ శక్తి మార్ట్లు నడపబడుతున్నాయి. తెలంగాణకు చెందిన హస్తకళలు మరియు చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను చేరుకోవచ్చని సెర్ప్ అధికారులు తెలిపారు.
సెర్ప్ లో ప్రస్తుతం 18,397 గ్రామ సంస్థలు, 554 మండల సమాఖ్యలు మరియు 30 జిల్లా సమాఖ్యలలో 4,35,364 ఎస్హెచ్జిలలో 45,60,518 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఈ లావాదేవీలు జనగాం జిల్లాతో ప్రారంభం కాగా, పాత వరంగల్ జిల్లాలోని ఇతర జిల్లాలకు దశలవారీగా విస్తరిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కూడా ఫ్లిప్కార్ట్ లో వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించవచ్చని వెల్లడించారు. హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెర్ప్ అధికారులు, ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY