తెలంగాణలో సంచలనం రేపిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుని విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు, న్యాయవాది భూసారపు శ్రీనివాస్కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం సిట్ అధికారులు కరీంనగర్లోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండటంతో తలుపుకు నోటీసులు అంటించారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 10:30 గంటలకు సిట్ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీసులలో శ్రీనివాస్ను కోరారు. కాగా ఈ కేసులోని ముగ్గురు నిందితులలో ఒకరైన సింహయాజీకి శ్రీనివాస్ విమాన టిక్కెట్టు బుక్ చేసినట్లు సిట్ గుర్తించింది.
అక్టోబర్ 26న సింహయాజీ తిరుపతి నుంచి హైదరాబాద్కు వచ్చారు. సిట్ అధికారుల సమాచారం ప్రకారం.. కరీంనగర్లో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది శ్రీనివాస్, అరెస్టయిన మరో నిందితుడు నంద కుమార్తో కూడా అక్టోబర్ 14న మాట్లాడారని, ఆ తర్వాత అక్టోబరు 26న సింహయాజీకి టికెట్ బుక్ చేశారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ను విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ అధికారులు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జరీ చేశారు. ఇక ఈ కేసులో దర్యాప్తుకు సంబంధించి వాస్తవాలు మరియు పరిస్థితులను నిర్ధారించడానికి శ్రీనివాస్ను ప్రశ్నించడానికి సహేతుకమైన కారణాలు మరియు ఆధారాలు ఉన్నాయని నోటిసులలో స్పష్టం చేశారు. కాగా విచారణకు వచ్చే సమయంలో శ్రీనివాస్ మొబైల్తో పాటు తనకు చెందిన ల్యాప్టాప్ లేదా టాబ్లెట్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలేవైనా ఉంటే తేవాలని, అలాగే వాటిలోని సమాచారాన్ని డిలీట్ చేయకుండా తీసుకురావాలని నోటీసులలో తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE