ఆగస్టు 16వ తేదీ నుండి ‘దళిత బంధు’ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగం సిద్ధం కావాలని కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ విస్తృతంగా చర్చించింది. కేబినెట్ సమావేశంలో దళిత బంధు పథకం పూర్వాపరాలను సీఎం విశదీకరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయని సీఎం అన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ‘‘మిషన్ కాకతీయ పథకం అమలు ద్వారా చెరువుల కింద సాగు పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యి అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చింది. కరెంటు సరఫరాలో వచ్చిన గుణాత్మక మార్పు వల్ల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఈ రోజు రాష్ట్ర ఆదాయంలో 20 శాతం ఆదాయం వ్యవసాయరంగం నుంచే వస్తున్నది. ఇది తెలంగాణ చరిత్రలో మేలిమి మలుపు’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తున్నదని, పల్లె ప్రగతి వల్ల మౌలిక వసతుల కల్పన జరిగి, గ్రామీణ జీవితం ఆహ్లాదంగా మారిందన్నారు. ఇందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనీయులని సీఎం అన్నారు. సమైక్య రాష్ట్రంలో విచ్చిన్నమయిపోయిన వృత్తి పనుల వారి జీవితాలను నిలబెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేపట్టిందని సీఎం చెప్పారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే ప్రణాళికలు అమలు చేస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వృత్తి పనులు చేసుకునే వారి ఆదాయాలు మెరుగు పడెందుకు తోడ్పడ్డాయన్నారు. గొర్ల పంపిణీ గొల్ల కుర్మలకు లాభం చేకూర్చిందని, పశు సంపద పెరిగిందని, ముఖ్యంగా గొర్రెల సంఖ్య ఎక్కువున్న రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంటు వేదికగా స్వయంగా కేంద్రం ప్రకటించిందని సీఎం గుర్తుచేశారు. ఇటీవల గొర్రెల యూనిట్ ధరను కూడా లక్షా ఇరవై ఐదు వేల నుంచి లక్షా డెబ్బై ఐదు వేలకు పెంచామని అన్నారు. చేపల పెంపకం ప్రోత్సహించడం వల్ల మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని సీఎం తెలిపారు. గీత కార్మికులకు చెట్ల పన్ను బకాయిలు రద్దు చేయటమే కాకుండా చెట్లకు పన్ను వేసే విధానాన్నే రద్దు చేశామని సీఎం తెలిపారు. నేత, మరమగ్గాల వారి ఆదాయాలు మెరుగు పడ్డాయి. నూలు రంగుల మీద సబ్సిడీతో పాటు బతుకమ్మ చీరల ఉత్పత్తి ద్వారా చేతినిండా పని దొరికేలా చేశామని సీఎం అన్నారు.
రైతుబీమా అమలవుతున్న విధంగా, అంతే పకడ్బందీగా క్రమబద్ధంగా నేత, గీత కార్మికులకు బీమా సదుపాయం కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నేత, గీత కార్మికులు ఆశావహంగా బీమా సదుపాయం కోసం వేచి వున్నారని, సత్వరమే అమలు విధానం పై స్పష్టత తీసుకురావాలని సూచించారు.
అదే దిశగా దళిత బంధు పథకం:
దళిత జాతి పేదరికం రూపుమాపాలని ప్రవేశపెడుతున్న ‘తెలంగాణ దళిత బంధు’ పథకానికి రాష్ట్ర కేబినెట్ ముక్త కంఠంతో ఆమోద ముద్ర వేసింది. దళిత జాతి కష్టాలు తీర్చడానికి ప్రవేశపెడుతున్న తెలంగాణ దళిత బంధు పథకం అమలుకు సంబంధించి మంత్రివర్గ సభ్యులు సూచనలు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకానికి చట్ట భద్రత కల్పిస్తూ ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేబినెట్ అభిప్రాయపడింది. గతంలో ఎస్సీ ప్రగతి నిధి చట్టం తెచ్చి, ఒక వార్షిక బడ్జెట్ లో దళితులకు కేటాయించిన నిధులలో మిగిలిన నిధులను తరువాతి వార్షిక బడ్జెట్ కు బదలాయించే విధానం తీసుకొచ్చామన్నారు. ఆ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అదే విధంగా దళిత బంధు కూడా దేశానికి దారి చూపే పథకం అవుతుందని కేబినెట్ అభిప్రాయపడింది.
రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీన స్థితిలో దళిత ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో ఇరవై శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో ఉన్న సాగు భూమి కేవలం పదమూడు లక్షల ఏకరాలే అని దళితుల పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో దళితులు ఉన్నారని సీఎం పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి, అరకొర సహాయాలతో సాధ్యం కాదని, అందుకే దళిత బంధులో ఒక యూనిట్ పెట్టుకోవడానికి పదిలక్షల రూపాయల పెద్ద మొత్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం అన్నారు. బ్యాంకులతో అనుసంధానం పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆదాయంలో ఆర్థిక స్థితిలో మెరుగుదల రాదనీ సీఎం తెలియజేశారు. లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెద్ద పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునే అవకాశాన్ని దళిత బంధు పథకం ద్వారా కల్పించాలనే సీఎం నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకునే స్వేచ్చ లబ్ధిదారులదే అని, ప్రభుత్వం అధికారులు, దళిత బంధు స్వచ్చంద కార్యకర్తలూ ఈ దిశగా మార్గదర్శనం చేస్తారని, అవగాహన కల్పిస్తారని సీఎం అన్నారు.
లబ్ధిదారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ శాఖ శిక్షణ అవగాహన కల్పించాలని కేబినెట్ అభిప్రాయపడ్డది. శిక్షణ, పర్యవేక్షణ కోసం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అమలులో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని సీఎం తెలిపారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో ‘‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’’ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. యూనిట్ పెట్టగానే ప్రభుత్వ బాధ్యత తీరిపోదని యూనిట్ సరిగ్గా నడుస్తుందా లేదా అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించడం కూడా ముఖ్యమని కేబినెట్ తీర్మానించింది.
దళిత బంధు పథకం అమలుకు పటిష్టమైన యంత్రాంగం అవసరమని వివిధ శాఖలలో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణా రావును కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు ద్వారా ఎవరికైతే లబ్ధి చేకూరుస్తారో వారికి అందజేసే ఒక ప్రత్యేక కార్డు నమూనాలను కేబినెట్ పరిశీలించింది. ఈ కార్డు ఆన్లైన్ అనుసంధానం చేసి లబ్ధిదారుని పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. దళిత వాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, మిగతా గ్రామంతో సమానంగా అన్ని హంగులూ దళిత వాడలకు ఏర్పడాలని, ఇందుకు నిధుల కొరత లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ