సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి తనదైన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ముందు నుంచి కూడా దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి.. పరిపాలనా విషయంలో కూడా అంతే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ హాట్ టాపిక్గా మారుతున్నారు. కేసీఆర్ సర్కార్పై ఎక్కడైతే నెగిటివిటీ వచ్చిందో ఆయా అంశాలనే టార్గెట్గా చేసుకొని ప్రజల మన్ననలు పొందేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్లో అడుగుపెట్టేందుకు కూడా వీలుండేది కాదు. అటువంటిది ప్రమాణస్వీకారం చేసిన మొదటిరోజే.. ప్రగతి భవన్ గేట్లను బద్ధలు కొట్టి సామాన్యులకు ప్రవేశకల్పించారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్ పేరును కూడా ప్రజాభవన్గా మార్చేశారు. ఒకప్పుడు వైఎస్సార్ హయాంలో నిర్వహించిన ప్రజాదర్భార్ను.. ప్రజావాణి పేరుతో ఇప్పుడు తిరిగి ప్రారంభించారు. వారానికి రెండుసార్లు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి ప్రజావాణిని నిర్వహిస్తున్నారు.
అయితే ఇలా ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అడ్వైజరీ కౌన్సిల్ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి పరిపాలనా విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఈ కౌన్సిల్ను ఏర్పాటు చేయబోతున్నారు. అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో పార్టీ పట్ల మాత్రమే కాకుండా.. తన నాయకత్వంపై కూడా నమ్మకం పెరుగుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ఈ నిర్ణయాలు తోడ్పడుతాయని అనుకుంటున్నారు.
అలాగే ప్రతిపక్షాలు కూడా తన నిర్ణయాలను తప్పు పట్టేందుకు వీలు లేకుండా రేవంత్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఇతర మేధావులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మండల స్థాయిలో గురుకులాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటిని తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్ పర్యవేక్షించనుంది. ఇక ఈ అడ్వైజరీ కౌన్సిల్లో ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, ప్రొఫెసర్ హరగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లకు చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE