తెలంగాణలో తాజాగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని పన్నెండు మంది అమాత్యుల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు తొమ్మిది మంది మంత్రులపై కలిపి మొత్తం 136 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి. ఎన్నికల సమయంలో అన్ని పార్టీల అభ్యర్థులు అఫిడవిట్లు సమర్పించినప్పుడు మొత్తం క్రిమినల్ అభ్యర్థుల లిస్టు వైరల్ అవగా.. ఇప్పుడు కొత సర్కార్లో కొలువుతీరిన అమాత్యులపై ఉన్న క్రిమినల్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
డిసెంబర్ 7 తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్రెడ్డిపైనే ఎక్కువగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. రేవంత్ రెడ్డిపై అందరికంటే ఎక్కువగా 89 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. 89 కేసుల్లో తీవ్రమైన క్రిమినల్ కేసులు 50 కేసులు ఉన్నాయట. అలాగే తమపై కూడా తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు ఐదుగురు మంత్రులు అసెంబ్లీ ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్లలో వెల్లడించారు.
మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుపై మాత్రం ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు తెలిపాయి. సీఎం రేవంత్రెడ్డి సహా 12 మంది అమాత్యుల అఫిడవిట్ల ఆధారంగా..వారి వారి నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు వంటి అంశాలపై సమీక్ష చేపట్టిన ఏడీఆర్ సంస్థ.. తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది.
పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తర్వాతి స్థానంలో.. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డిపై 11 కేసులు ఉన్నాయి. ఉత్తమ్ తర్వాత 7 కేసులతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, 6 కేసుల చొప్పున ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉన్నారు. అలాగే 5 కేసుల చొప్పున ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉండగా.. 3 కేసుల చొప్పున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు.
మరోవైపు సీతక్క తప్ప మిగిలిన అంతమంది మంత్రులు కోటేశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థ వెల్లడించింది . తెలంగాణ మంత్రివర్గంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మొత్తం 12 మంది మంత్రుల్లో 11 మంది కోటీశ్వరులే ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఈ పన్నెండు మంది మంత్రుల ఆస్తుల లెక్కలలో.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అత్యధికంగా రూ.433.93 కోట్ల విలువైన ఆస్తులతో ఆస్తులు ఉన్న మంత్రిగా అగ్రస్థానంలో నిలిచారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తర్వాత స్థానంలో రూ.46.66 కోట్లతో దామోదర రాజనర్సింహ ఉన్నారు. ఆ తర్వాత రూ.39.55 కోట్లతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉండగా రూ.30.04 కోట్లతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. అయితే ఈ మంత్రి వర్గంలో రూ.82.83 లక్షల ఆస్తులతో మంత్రి సీతక్క.. అత్యల్ప ఆస్తులున్న మంత్రిగా నిలిచారు. మరోవైపు వీరిలో 10 మంది మంత్రులు తమకు అప్పులున్నాయని ప్రకటించగా.. అప్పుల జాబితాలోనూ రూ.43.53 కోట్లతో మంత్రి పొంగులేటి టాప్లో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ