కరోనా మహమ్మారి వచ్చింది మొదలు అన్ని దేశాలు భయం గుప్పిట్లోనే బతుకుతున్నాయి. ఎప్పుడు ఏ వైరస్ ముంచుకొస్తుందోనన్న టెన్షన్తో పాటు.. లాంగ్ టర్మ్ కోవిడ్ వల్ల ఎవరు ఎలా భాధపడతారో తెలియక భయభయంగానే గడుపుతున్నారు. దానికి తగ్గట్లే ఏదొక దేశంలో ఏదొక కొత్త వైరస్ పేరు వినిపిస్తూ జనాలను వణికిస్తూనే ఉంది.
తాజాగా అలాగే యూకేని ఇప్పుడు 100 రోజుల ‘దగ్గు’ భయపెడుతోంది. ఈ దగ్గు కోరింత దగ్గు రకానికి చెందినదని.. ఈ దగ్గు మూడునెలల పాటు కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. జలుబుతో మొదలయ్యే ఈ దగ్గుని తేలికగా తీసుకోవద్దని.. జలుబు, దగ్గు రాగానే తప్పనిసరిగా మాస్కులు వాడాలని అక్కడి ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిని వందరోజుల దగ్గుగా ఎందుకు పిలుస్తున్నారంటే.. ఈ దగ్గు వస్తే 3 నెలల పాటు రోగి దగ్గుతూనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
యూకేలో ఇప్పుడు దగ్గుతో బాధపడేవాళ్లు రోజురోజుకు ఎక్కువ అవుతున్నారు. కోరింత దగ్గుగా కనిపిస్తున్న ఈ దగ్గు రావడానికి ముందుగా ముక్కు కారడం, గొంతు నొప్పితో మొదలవుతుంది. అందుకే దీనిని చాలామంది సాధారణ జలుబుగా అనుకుని నిర్లక్ష్యం వహిస్తున్నారు. తర్వాత జలుబు తగ్గకముందే దగ్గు మొదలై ఉక్కిరి బిక్కిరిచేసే దగ్గుగా తయారవడంతో.. రోగులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
విపరీతంగా, నాన్ స్టాప్గా వస్తున్న ఈ దగ్గు వల్ల గొంతులో పుండ్లు, చెవిలో ఇన్ఫెక్షన్లు రావడమే కాకుండా.. ఓ దశలో మూత్రవిసర్జన ఆపుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాక్టీరియా వల్ల సంభవిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. 3 నుంచి 4 నిముషాల పాటు విపరీతంగా దగ్గు రావడం వల్ల కొందరిలో వాంతులు రావడం , లేదా పక్కటెముకలు విరిగడం వంటి ప్రమాదాలకు కూడా గురయినట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతోనే యూకేలో అధికారుల అందరినీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఈ వంద రోజుల దగ్గు గతేడాదితో పోలిస్తే 250 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. చివరకు కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించిన సమయంలో కూడా ఇలాంటి తీవ్రమైన పరిస్థితి కనిపించలేదని నివేదిక చెబుతోంది. ముఖ్యంగా పిల్లలలోనూ, వృద్ధుల్లోనూ ఈ ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తోన్నట్లు గుర్తించింది. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ మధ్య వెలుగులోకి వచ్చిన ఈ వంద రోజుల దగ్గుతో ఇంగ్లాండ్, వేల్స్ లో 2,716 మంది ఇబ్బంది పడ్డారు. 2022 తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.
పిల్లల్లో ఈ వంద రోజుల దగ్గును నివారించడంతో పాటు ఈ దగ్గు మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి టీకాలు అవసరం అని యూకే హెల్త్ సెక్యూరిటీ హెచ్చరిస్తోంది. గర్భిణీలు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని .. దగ్గు ఉన్నవారే కాకుండా ప్రతీ ఒక్కరు కరోనా సమయంలో ధరించినట్లే.. అంతా మాస్కులు ధరించాలని పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ