చూడాలే కానీ ఎన్నికలలో ఎన్ని సిత్రాలు అయినా చూడొచ్చంటారు రాజకీయ విశ్లేషకులు. ఓట్ల కోసం నేతల పాట్లే కాదు.. సీట్ల కోసం పార్టీ మార్చిన నాయకుల సీన్లు ఎన్నికల సమయంలో వెరీ కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అప్పటి వరకూ ఒకరిపై ఒకరు తిట్ల దండకం అందుకున్న నేతలే.. తెల్లారిపోయాక ఒకే పార్టీకోసం ఓట్లు అడగటం కూడా ఓటర్లకు సదా మామూలు విషయంగా అయిపోయింది. నిన్నటి వరకూ ఓ పార్టీ జెండా మోసినోడు.. మర్నాడు మరో జెండాతో దర్శనమిస్తుంటాడు.
తాజాగా ఇలాంటి సీనే నిర్మల్లో కనిపిస్తోంది. నిర్మల్ అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులయిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఏలేటి మహేశ్వర్రెడ్డి, కూచాడి శ్రీహరిరావు మధ్య పోటీ.. నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. వీరు ముగ్గురూ పార్టీలు మార్చినా ఆ నియోజకవర్గంలో పోటీపడుతున్న అభ్యర్థులు మాత్రమే వారే. ఈ సారి బీఆర్ఎస్ నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి కూచాడి శ్రీహరిరావు బరిలో నిలబడుతున్నారు. ఈ ముగ్గురు నాయకులు గతంలో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసిన వారే కావడం.. ఇప్పుడు కూడా వేరు వేరు పార్టీలలోకి జంపయి ఈ ముగ్గురూ మరోసారి పోటీ పడటం అక్కడ చర్చనీయాంశం అయింది.
2009 వ సంవత్సరం, 2014 వ సంవత్సరం, 2018 వ సంవత్సరంలో జరిగిన వరుస ఎన్నికల్లో ..2018 ఎన్నికలలో మాత్రం శ్రీహరిరావు పోటీ చేయలేదు. మిగతా ఎన్నికల్లో ఈ ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతూనే ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా మహేశ్వర్రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి ఇంద్రకరణ్రెడ్డి అలాగే బీఆర్ఎస్ తరఫున శ్రీహరిరావు పోటీ పడ్డారు. అప్పుడు ఇందులో మహేశ్వర్రెడ్డి.. 2545 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
అలాగే 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ ముగ్గురు అభ్యర్థులు వేర్వేరు పార్టీ నుంచి బరిలో నిలిచారు.అప్పటికి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మహేశ్వర్రెడ్డి పోటీ పడగా, బీఆర్ఎస్ నుంచి శ్రీహరిరావు, బహుజన సమాజ్ పార్టీ అంటే బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఇంద్రకరణ్రెడ్డి గెలుపొంది రికార్డు సృష్టించారు. బీఎస్పీ అభ్యర్థిగా గెలుపొందిన ఇంద్రకరణ్రెడ్డి..ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్ఠానం సూచనతో శ్రీహరిరావు పోటీ చేయకుండా.. ఇంద్రకరణ్ రెడ్డి గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. దీంతో 2018 ఎన్నికల్లో శ్రీహరిరావు పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఇంద్రకరణ్రెడ్డి, కాంగ్రెస్ నుంచి మహేశ్వర్రెడ్డిలు పోటీ పడగా.. ఇంద్రకరణ్రెడ్డి విజయం సాధించారు. ఇలా వరుసగా నాలుగుసార్లు పోటీపడుతున్న మహేశ్వర్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డితో పాటు మూడోసారి శ్రీహరిరావు పోటీ పడబోతున్నారు. దీంతో పార్టీలు మారినా వారే అభ్యర్థులుగా ఉండటంతో వీరిలో ఎవర్ని ఓటర్లు ఆదరిస్తారా అన్న అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE