మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో స్పోర్ట్స్ బైక్పై నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి ఐకియా వైపు వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాద ఘటనలో సాయిధరమ్ తేజ్కు గాయాలు అయ్యాయి. ముఖ్యంగా కుడికన్ను, ఛాతి, పొట్ట భాగంలో గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలో వెళ్లగా, ముందుగా పోలీసులు 108 సాయంతో సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక పరీక్షల అనంతరం, మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన్ను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
మరోవైపు సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని, ఆయన కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా సాయిధరమ్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు. “సాయిధరమ్ తేజ్ కొన్ని గంటల క్రితం ప్రమాదానికి గురయ్యారు. అతనికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఎలాంటి ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదని అభిమానులకు, శ్రేయోభిలాషులకు తెలియజేస్తున్నాను. అతను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు మరియు రెండు రోజుల్లో ఆరోగ్యంగా తిరిగి వస్తాడు” అని చిరంజీవి పేర్కొన్నారు. ముందుగా ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే చిరంజీవి, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఉపాసన, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, త్రివిక్రమ్, సందీప్ కిషన్ సహా పలువురు ఆసుపత్రికి చేరుకుని సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ నటీనటులు, అభిమానులు పార్ధిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ