తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర వరంగల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలో పాదయాత్రలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో మనుషులకు కనీసం కుక్కల నుంచి కూడా రక్షణ లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఉద్యమ సమయంలో సాధారణ జీవితం గడిపిన కేసీఆర్కు హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాల భూములు, పేపర్లు, టీవీలు ఎలా వచ్చాయి? ధరణి పేరుతో దందాలు మొదలు పెట్టారు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతం ఆడపడుచుల చైతన్యానికి ప్రతీక. రాణీ రుద్రమదేవి, విస్నూరు దొరల మీద తిరుగబాటు చేసిన చాకలి ఐలమ్మ వంటి వారు నడిచిన గడ్డ ఇది. అలాంటి ఈ ప్రాంతంలో ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది’ అని తెలిపారు.
ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పాదయాత్రలో ఎవరిని కదిలించినా కష్టాలే కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు రాలేదని యువకులు, రుణమాఫీ కాలేదని రైతులు తల్లడిల్లుతున్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన వాటిలో.. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, మైనార్టీలకు రిజర్వేషన్లు, గిరిజనులకు రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతుకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు.. ఇలా ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కానీ సీఎం కేసీఆర్, ఆయన బంధువులు మాత్రం ఆస్తులు పెంచుకున్నారు’ అని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నక్సలెట్ల ఏజెండానే తన ఏజెండా అని చెప్పిన కేసీఆర్.. నేడు తన కొడుకుకి, కూతురికి, అల్లుడికి, సడ్డకుని కొడుకుకి, ఉద్యమ ద్రోహి ఎర్రబెల్లి దయాకర్ రావు, బంధువు వినోద్ కుమార్ వంటి వారికి పదవులు ఇచ్చారు. ఇది ఏ నక్సలైట్ ఏజెండాలో ఉంది? అని రేవంత్ ప్రశ్నించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిపై కూడా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే గండ్ర భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. మంత్రి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా కేటీఆర్కు సవాల్ విసురుతున్నా.. మీ ఎమ్మెల్యే ఆక్రమించున్న భూములపై విచారణకు సిద్ధమా? సింగరేణి నిధుల దోపిడీపై విచారణకు సిద్ధమా? ఎమ్మెల్యే రమణారెడ్డి అవినీతిపై చర్చకు మేం రెడీ, మీ ఎమ్మెల్యే అవినీతిని నిరూపించేందుకు మేము సిద్ధం, బహిరంగ చర్చకు మంత్రి సిద్ధమా? అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమేల్యేలను ‘డర్టీ డజన్’ అని అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. వారిని దొరల పశువుల పాకలో కట్టేశారని వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE