టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడుపై గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేసారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన తెరాస నాయకుడు అంబటి వెంకన్న తన భార్యతో కలిసి ఉదయం నడకకు వెళ్లారు. ఈ సమయంలో మార్గ మధ్యలో కొందరు గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా అతనిపై కత్తులతో, గొడ్డళ్లతో దాడి చేసి పరారయ్యారు.
తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉండడంతో అంబటి వెంకన్నకు ప్రధమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్ లోని ఆసుపత్రికి తరలించారు. వెంకన్నపై దాడి జరుగుతున్న సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతని భార్యపై కూడ దుండగులు చేయి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సంఘటనకు భూ వివాదాలు కారణమయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
[subscribe]