నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూసుకుంట్ల 10 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం తొలిసారిగా మునుగోడుకు వచ్చారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. దీనిలో పాల్గొన్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముందుగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ప్రజలకు అభివాదం చేశారు. కాగా కూసుకుంట్ల విజయోత్సవ ర్యాలీలో టీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అనుచరులతో పాటు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అయితే ఈ సందర్భంగా మునుగోడులో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీ మునుగోడుకు చేరుకుని అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కూసుకుంట్ల పూలమాల వేస్తున్న సమయంలో గొల్ల కురుమలకు మద్దతుగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆందోళనకు దిగారు. గొల్ల కురుమల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు వేసి వెనక్కి తీసుకుందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించేందుకు ఆయన కూడా ప్రయత్నించడంతో విగ్రహం దగ్గర టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు.దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు కలుగజేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE