టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నిజామాబాద్లో ‘ఆసరా’ పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ఆమె భోజనం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఆసరా పథకం వారికి ఎలా మద్దతిచ్చిందో వారి నుంచి వినడం చాలా సంతోషం కలిగించిందని కవిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ప్రస్తుతం నిజామాబాద్లో దాదాపు 50 వేల మందికి పింఛన్లు అందిస్తున్నామని, ఇదే మాదిరి తెలంగాణవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఇద్దరికి పింఛన్లు అందించే స్థాయికి రాష్ట్రం ఆర్ధికంగా ఎదగాలని ఆమె పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని, ఇక్కడ అమలు చేస్తున్నట్లుగా దేశంలో ఇంకెక్కడా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పనులు కానీ జరగడం లేదని తెలిపారు.
తెలంగాణలో పింఛన్లు అందుకుంటున్న వారిలో వృద్దులు, వికలాంగులు, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు, కిడ్నీ బాధితులు, బోదకాలు వ్యాధి ఉన్నవారు.. ఇలా అన్ని రకాల వారు ఉన్నారని కవిత తెలిపారు. పేదరికంతో బాధపడుతూ, అయినవాళ్లకు భారంగా మారుతున్నామనే భావనను వారిలో దూరం చేయటానికే సీఎం కేసీఆర్ ‘ఆసరా’ పింఛన్ల పథకం అమలు చేస్తున్నారని వెల్లడించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మానవత్వంతో పింఛన్లు అందిస్తుంటే, మరోవైపు కేంద్రం మాత్రం ఇవి ‘ఉచితాలు’ అని అంటోందని, వీటిని నిలిపివేయాలని కోరుతోందని మండిపడ్డారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా సీఎం కేసీఆర్ ఈ పథకాలు వేటినీ ఆపడం లేదని, లబ్ధిదారులు, యువకులు దీనిని గుర్తించి ఇతరులకు కూడా తెలియజేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ