కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహిస్తున్న “రైతు సంఘర్షణ సభ” సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయనకు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. మీరు కానీ, మీ పార్టీ కానీ పార్లమెంటులో తెలంగాణ అంశాలు, హక్కులను ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్పాలని రాహుల్ గాంధీని ఆమె డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం టీఆర్ఎస్ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
“దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు?, తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు?, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా వంటి పథకాలపై ఆరా తీసి, అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో మీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోండి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను స్ఫూర్తిగా తీసుకుని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. వాటి గురించి నేర్చుకుని అర్ధం చేసుకోవడానికి మీకు తెలంగాణకు స్వాగతం” అని రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ