హైదరాబాద్ అభివృద్ధిపై 6 సంవత్సరాల ప్రగతి నివేదికను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఈ రోజు విడుదల చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే టిఆర్ఎస్ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడూతూ, ఇంటింటికీ వెళ్లి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల గురించి చెప్పి ఓట్లు అడగాలని అభ్యర్థులకు సూచించారు. హైదరాబాద్లో వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుందని, ఆరున్నర లక్షల మందికి రూ.650 కోట్ల సాయం అందించామని పేర్కొన్నారు. రాష్ట్రానికి జరిగిన వరద నష్టంపై కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాసిన కూడా ఇప్పటి వరకు కేంద్ర సాయం అందించలేదని అన్నారు. నవంబర్ 28న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. గత ఎన్నికల్లో ఒక్క బాల్ కొడితే సెంచరీ అయ్యేది. జాంభాగ్ డివిజన్ లో 5 ఓట్లతో ఓడిపోయామని, ఇప్పుడు సెంచరీ కొట్టాలని ఆశిస్తున్నామని చెప్పారు.
అభివృద్ధి హైదరాబాద్ కావాలా లేదా అశాంతి హైదరాబాదా అనేది ప్రజలే నిర్ణయించాలి:
“తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. హైదరాబాద్లో ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణకు హైదరాబాద్ ఆర్థిక ఇంజిన్ వంటిది. హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ ఉజ్వలంగా దూసుకెళ్తుంది. ముఖ్యంగా రెండు అంశాల గురించి ఆలోచించాలని హైదరాబాద్ ప్రజలకు చెప్పాలని అభ్యర్థులకు సూచించారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న హైదరాబాద్ కావాలా?. నిత్యం ఘర్షణలతో తల్లడిల్లే హైదరాబాద్ కావాలా? ఆరేళ్లలో ఎలాంటి గొడవలు లేకుండా ముందుకెళ్తున్నాం. అభివృద్ధి హైదరాబాద్ కావాలా, లేక అశాంతి హైదరాబాదా అనేది ప్రజలే నిర్ణయించాలి” అని మంత్రి కేటిఆర్ అన్నారు.
“హైదరాబాద్ నగరంలో 200 కి పైగా బస్తీ దవాఖానాలు ప్రారంభించాం. గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు నిర్మించాం. 137 కొత్త లింకు రోడ్లు నిర్మిస్తున్నాం. అవసరమైన చోట ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం. అన్నపూర్ణ పథకం కింద రూ.5 భోజనం ఏర్పాటు చేశాం. 25 ఏండ్లుగా ఉన్న తాగునీటి సమస్యను టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిష్కరించాము. పారిశ్రామిక వాడల్లో కూడా 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నాము. అలాగే ఆరేళ్ల నుంచి నగరంలో పేకాట క్లబ్బులు, గుడుంబా, ఆకతాయిల ఆగడాలు లేవు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లో శాంతిభద్రతలు పటిష్టంగా మారాయి” అని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ