ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్– 300 టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి ఇతర భారత షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్ దూరంకాగా, ఆ జాబితాలోకి సైనా నెహ్వాల్ కూడ చేరింది. గత కొన్ని రోజులుగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న సైనా నెహ్వాల్, వ్యక్తిగత కారణాలతోనే ఈ టోర్నీ నుంచి వైదొలిగినట్టుగా తెలుస్తుంది. సైనా కూడ తప్పుకోవడంతో ఈ టోర్నీలో భారత్ నుంచి మహిళా క్రీడాకారుల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక వచ్చేవారం లక్నో లో జరిగే సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నీలో సైనా ఆడే అవకాశం ఉంది.
మరో వైపు పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్ సత్తా చాటాలని చూస్తున్నాడు. గాయాల కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్న శ్రీకాంత్ ఇటీవలే జరిగిన హాంకాంగ్ ఓపెన్లో ఫామ్ అందుకుని సెమీస్ కు చేరాడు. ఆ ప్రదర్శనను మళ్ళీ పునరావృతం చేసి కొరియా మాస్టర్స్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. శ్రీకాంత్ తన తొలి రౌండ్ లో హాంకాంగ్ ఆటగాడైన వోంగ్ వింగ్ కి విన్సెంట్ తో తలపడనున్నాడు. ఇప్పటివరకు వారిద్దరి మధ్య జరిగిన పోటీల్లో శ్రీకాంత్ 10–3తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ పై ఆధిపత్యంలో ఉన్నాడు. ఇక ప్రపంచ 16వ ర్యాంకర్, భారత షట్లర్ సమీర్ వర్మ తొలిరౌండ్ లో చైనా ఆటగాడు షియుకి తో తలపడుతుండగా, అతని సోదరుడు సౌరభ్ వర్మ క్వాలిఫయర్తో ఆడనున్నాడు.