హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రతిరోజు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విచేస్తుండటం తెలిసిందే. కాగా, ఈరోజు ఈ పవిత్ర వేడుకలలో పాల్గొనటానికి పలువురు ప్రముఖులు వచ్చారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ మరియు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండిట్ రవిశంకర్ హాజరయ్యారు. ఈ క్రమంలో శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆశ్రమం శ్రీరామనగరంలో ప్రతిష్టించిన శ్రీ రామానుజుల 216 అడుగుల ‘సమతామూర్తి‘ విగ్రహాన్ని వారు దర్శించుకున్నారు. అనంతరం సమతా క్షేత్రంలో ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. శ్రీ రామానుజాచార్యులు దేశ సంస్కృతిని తరువాతి తరాలకు అందించటానికి పాటుపడ్డారని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ వివరించారు. స్వామి వారి సహస్రాబ్ది వేడుకలకు రావడం తన అదృష్టమని ఆయన తెలిపారు. మరో అతిథి పండిట్ రవిశంకర్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో రామానుజాచార్యులు ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి నిలిచారని అన్నారు. ఆది శంకరాచార్య మరియు రామానుజాచార్య వంటి గురువుల వలననే భారతదేశం ఈనాడు ఈ స్థాయిలో నిలిచిందని పేర్కొన్నారు. ఇక కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన ప్రసంగంలో ఈ విధంగా చెప్పారు.. తన గురువు వద్దని హెచ్చరించినా, శ్రీ రామానుజాచార్యులు మాత్రం లోక కల్యాణం కోసం, దీనులను ఉద్దరించటం కోసం పరమ పవిత్రమైన “ఓం నమో నారాయణాయ” మంత్రాన్ని అందరికీ అందించారని కొనియాడారు. ఇంతటి మహోన్నత కార్యక్రమం నిర్వహించాలంటే ఎంతో సంకల్పం కావాలని.. చినజీయర్ స్వామి వారు మాత్రమే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించగలరని రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ